కరోనా వైరస్ దెబ్బకు ఈ ఏడాది వింబుల్డన్ రద్దయింది. రద్దు ఐనా టోర్నమెంట్ నిర్వాహకులకు 946 కోట్లు వస్తున్నాయి.వింబుల్డన్నిర్వాహకులకు వచ్చినట్టుగానే, ఐపిఎల్ నిర్వాహకులకు అవకాశం ఉందా ?
ఐపిఎల్ కు అవకాశం ఉందా ?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బకు ఈ ఏడాది వింబుల్డన్ రద్దయింది. అయినా ఆ టోర్నమెంట్ నిర్వాహకులకు ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదు. కారణం ఆ చాంపియన్షి్పనకు వారు బీమా చేయించడమే. దాంతో టోర్నీ రద్దయినందుకు బీమా కంపెనీ నుంచి వింబుల్డన్ (ఆల్ ఇంగ్లండ్ క్లబ్) నిర్వాహకులకు ఏకంగా రూ. 946 కోట్ల మొత్తం అందనుంది. మరి కొవిడ్-19 ధాటికి ఐపీఎల్ కూడా రద్దయితే.. బీసీసీఐకి కూడా బీమా లభిస్తుందా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అయితే బోర్డు మాత్రం బీమా రాకపోవచ్చనే అంటోంది. కారణం ఇన్సూరెన్స్ అనేది ఒక్కో ప్రాంతానికీ తేడా ఉండడమేనట! ఏదైనా అంటువ్యాధితో టోర్నీ రద్దయితే బీమా క్లెయిమ్ చేసే నిబంధన పాలసీలో ఉండడంవల్లే ఆల్ఇంగ్లండ్ క్లబ్కు బీమా లభిస్తోందని బీసీసీఐ చెబుతోంది. వింబుల్డన్తో ఐపీఎల్ను పోల్చేముందు మార్కెట్ పరిస్థితులు, బీమా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బోర్డు అధికారి అన్నారు. వైరస్ బారినపడి టోర్నమెంట్ రద్దయితే బీమా చెల్లించే నిబంధన భారత బీమా మార్కెట్లో ఉన్నదా..అన్నది చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘బీమా విషయంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడా ఉంటుంది. ఇంగ్లండ్ బీమా మార్కెట్ భిన్నంగా అభివృద్ధి చెందింది. ఇంగ్లండ్లో రీ ఇన్సూరెన్స్కు సంబంధించి పెద్దపెద్ద సంస్థలున్నాయి. అలాగే అక్కడి బీమా రంగంలో సంక్లిష్టతలు, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకొని వింబుల్డన్లాంటి బీమా సదుపాయంపై చర్చించాలి’ అని ఆయన సూచించారు. ‘ఏదైనా మహమ్మారివల్ల టోర్నమెంట్ నిర్వహించలేకపోతే నష్ట పరిహారం చెల్లించే పాలసీ భారత బీమా మార్కెట్లో ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.